హైదరాబాద్ : పోలీస్ రిక్రూట్మెంట్ వయోపరిమితిని మరో ఆరేండ్లు పొడిగించి, నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆయన లేఖ రాశారు. ''తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొలువులు మాకే వస్తాయన్న నినాదంతో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. కానీ 2011 సంవత్సరం నుండి పోలీస్ రిక్రూట్మెంట్ నామమాత్రంగా ఉన్నది. జీవోనెంబర్ 60 ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్లో మూడెండ్లు సడలించి ఎస్ఐ పోస్టుకు 28ఏండ్లు, కానిస్టేబుల్ పోస్టుకు 25ఏండ్లు వయోపరిమితి పెట్టారు. ఈ మూడేండ్ల సడలింపుతో కొద్దిమంది మాత్రమే లబ్ది పొందుతున్నారు. మరో 1.5లక్షల మంది ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులు రిక్రూట్మెంట్లో పాల్గొనే అర్హతను కోల్పోయి నష్టపోతున్నారు. ఎస్ఐ పోస్టుకు మహారాష్ట్రలో 31సంవత్సరాలు, గుజరాత్లో 35సంవత్సరాలు, బీహార్లో 37సంవత్సరాల వయోపరిమితి ఉన్నది. కావున పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని రిక్రూట్మెంట్లో వయోపరిమితిని మరో ఆరు సంవత్సరాలకు పెంచాలి.'' అని తమ్మినేని తన లేఖలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm