పోలవరం: పోలవరం ప్రాజెక్టు విషయంలో భాజపాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కన్నా నేతృత్వంలో భాజపా బృందం ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని.. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే స్పష్టం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన గడువులోనే ప్రాజెక్టును పూర్తిచేస్తే తామూ సహకరిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు నిధులను కేంద్రం పూర్తిగా చెల్లించిందని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.18వేల కోట్లు బకాయిలు ఇవ్వాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు నిర్వాసితులు చెబుతున్నారని పేర్కొన్నారు. అన్యాయంపై పోరాడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని కన్నా ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm