శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కార్కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న క్రమంలో కాషాయ పార్టీ చేసిన విమర్శలకు మెహబూబా ముఫ్తీ దీటుగా బదులిచ్చారు. బీజేపీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సంకీర్ణ సర్కార్ అజెండాకు బీజేపీ స్వయంగా నీళ్లొదిలిందని దుయ్యబట్టారు. 370పై యథాతథ స్థితి, పాకిస్తాన్, హురియత్ నేతలతో చర్చలు సంకీర్ణ అజెండాలో భాగమని పేర్కొన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న కశ్మీర్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు విశ్వాసం కల్పించే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరణ, కాల్పుల విరమణ తక్షణం చేపట్టాల్సిన చర్యలని ఆమె ట్వీట్ చేశారు. జమ్ము, లడఖ్ ప్రాంతాలపై వివక్ష చూపుతున్నామనే బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm