విజయవాడ: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో రాజు అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్లో ఇవాళ జరిగిన కార్యక్రమానికి ఆయన వచ్చాడు. అక్కడ కొంతమందికి గేట్మెన్ శిక్షణ ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ఇనిస్టిట్యూట్ గేట్ వద్ద ఉన్న రాజును ఓ వ్యక్తి కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అక్కడున్న సాక్షులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కత్తితో రాజును పొడిచి బైక్పై పరారయ్యాడు. స్థానికులు వెంటపడేసారికి బైక్ వదిలి, ఆటో ఎక్కి పరారయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇది పాతకక్షల నేపథ్యంలో జరిగినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రాజు నెల్లూరు నుంచి వచ్చాడని, అక్కడ కుటుంబ, ఆస్తి తగాదాలు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm