వరంగల్: జిల్లాలోని ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతుకు, ఎమ్మార్వోకు మధ్య జరిగిన ఘర్షణ సంచలనం రేపుతోంది. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు ఇచ్చే క్రమంలో సీతంపేట గ్రామానికి చెందిన మర్రి రవి అనే రైతుకు సంబంధించిన భూమి వివాదాస్పదంగా ఉంది. అది కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలంటూ ఆ రైతు చాలా రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పగా... సోమవారం మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన రవి ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగాడు. ఒక దశలో ఎమ్మార్వో చొక్కాపట్టి లాగడంతో.. అక్కడున్న సిబ్బంది రైతును బయటకు నెట్టేసి దాడి చేశారు. రైతు స్వల్పంగా గాయపడ్డాడు. తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకున్నారని, తన భూమి పట్టా పుస్తకం ఇవ్వడానికి ఎందుకింత జాప్యం చేస్తున్నారని, ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు తనను ఇబ్బందిపెడుతున్నారంటూ.. సిబ్బంది కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. అయితే ఎమ్మార్వో మాత్రం వివాదాస్పద భూములకు పట్టా పుస్తకాలు ఇవ్వడంలేదని చెప్పారు. కాగా రైతు తన కాలర్ పట్టుకున్నాడని ఎమ్మార్వో పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని స్టేషన్కు తీసుకువెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm