నెల్సన్ మండేలా! ఓ స్వాప్నికుడు... శాంతి కాముకుడు... విశ్వశాంతికి సంకేతం... పీడనకు, దోపిడీకి, భయానికి తావులేని సమాజం కావాలనేది ఆయన కల. దక్షిణాఫ్రికా విమోచనో ద్యమానికి జీవం. మనిషిని పశువుగానో, పనిముట్టు గానో చూడటంపై నిప్పులు చెరిగిన పోరాట యోధుడు. జాతివివక్ష, దోపిడీ, బానిసత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధిక్కార పతాకం. దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా కొనసాగిన వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి 27 సంవత్స రాలు జైల్లో నిర్బంధించ బడినవాడు. జాత్యహంకార శ్వేత జాతి ప్రభుత్వం పాటిస్తున్న వివక్షను నిరసిస్తూ ఉద్యమించి నల్లజాతీయు లకు విముక్తి కల్పించిన వీరుడు నెల్సన్ మండేలా. అందుకే ప్రపం చంలో ప్రజలను విముక్తి చేయడం కోసం పోరాడిన అతికొద్ది మందిలో ఒకరిగా కీర్తి పొందారు. ప్రపంచానికి దూరమైనప్పటికీ, మానవాళి ఉన్నంత కాలం, అణచివేత, వివక్ష, దోపిడీ ఉన్నంత కాలం నెల్సన్మండేలా బతికే ఉంటాడు. బానిస త్వంపై తిరుగుబాటు చేసిన సమాజ పరిణామ క్రమంలో మొదటి తరానికి చెందిన స్పార్టకస్, ఏసుక్రీస్తు పేర్లు ఎలాగైతే అజరామరంగా ఉంటు న్నాయో, విముక్తి ఉద్యమాలు జరిగే చోట, దోపిడీ, అణచివేతలు జరిగే చోట వీరి పేర్లు ఎలాగైతే ప్రతిధ్వనిస్తున్నాయో... అలాగే 21వ శతాబ్దపు విముక్తి ఉద్యమ వీరుడిగా నెల్సన్ మండేలా పేరు కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. శతాబ్దాల అణచివేతలో మగ్గిపోయి మసిబారిన బొమ్మల్లా ఉన్న వారి కోసం జీవితకాలం ఉద్యమాన్ని కొనసాగించిన అగ్రగణ్యుడు నెల్సన్ మండేలా. తరతరాలుగా తలలు వంచుకొని బ్రతికిన వారిని బ్యాలెట్(ఓటు హక్కు) వరకూ తీసుకెళ్ళి వారిని జీవమున్న 'మనుషులుగా' నిటారుగా నిలబెట్టేందుకు నేలను చీల్చుకుంటూ 'ఎగిసిపడిన స్వేచ్ఛా పతాక' మండేలా. అనేక దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్యమం ఫలితంగా 1994 ఏప్రిల్ 26వ తేదీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఒక ఆఫ్రికన్ యువకుడు తనను పలకరించిన ఇంగ్లీష్ పత్రికా విలేకరితో ఇప్పుడు నేను మనిషి అన్న మాట వెనుక వందల వేల మంది ఆత్మార్పణ ఉంది. త్యాగం ఉంది. వారి రక్తం ఉంది. పోరాట యోధుల చిత్రహింస లున్నాయి. భారతీయుడైన 'మహాత్మాగాంధీ' నాయకత్వం ఉంది. పోరాటం ఉంది. భారతీయులైన డాక్టర్ జిఎం నాయకర్, డాక్టర్ యూసఫ్దాదూ, తదితరుల త్యాగాలున్నాయి. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా కొనసాగించిన వీరోచితమైన పోరాటం ఉంది. అందుకే దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చెపట్టినప్పుడు 'నేల మీద నడిచే దేవ దూత' అంటూ కొనియాడారు. దక్షిణాఫ్రికా శాంతియుత పరిణామా నికి ఎంతగానో పొగడ్తలు, ప్రసంసలు లభించాయి. దక్షిణాఫ్రికా జాతిపితగా, ప్రజాస్వామ్య వ్యవస్థాపకుడి గా ప్రజల ఆదరణ పొందాడు. ఆఫ్రికా జాతి విముక్తి నేతగా పేరొందాడు. నెల్సన్ మండేలా జ్ఞాపకారం వివిధ నగరాల్లో మండేలా విగ్రహాలు ప్రతిష్టితమ య్యాయి. 1993లో నోబెల్ శాంతి బహుమతి అందుకు న్నాడు. జాతి వివక్ష నిర్మూలన కోసం మండేలా జరిపిన పోరాటానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజు జులై 18న 'మండేలా డే' గా ఐరాస జనరల్ అసెంబ్లీ 2009 నవంబర్లో ప్రకటించింది. 1990లో భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. బ్రతికుండగానే ఇలాంటి గౌరవం, పురస్కారాలు అందుకున్న నెల్సన్ మండేలా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అయితే ప్రపంచశాంతి అనేది నినాదంగానే ఉంది. ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో సైతం మనిషికి కావాల్సిన కనీస అవసరాలు అందటం లేదు. భూ సంస్కరణలు లేవు. గనుల జాతీయకరణ లేదు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం, జాతి దురహంకారం మానవాళిపై వంద రెట్లు పైచేయిగా పెత్తనం చేలాయిస్తూనే ఉందనేది మరవకూడదు.. 'చిన్న అద్భుతం-దేవుని ఇంద్రధనుస్సు దేశం' అని పిలుచుకునే దక్షిణాఫ్రికాలో మన దేవ దూత సైతం ప్రైవేటీకరణ నుంచి విముక్తి చేయలేకపోయాడనేది, అమెరికా సామ్రాజ్యవాదుల తాకట్టు నుంచి రక్షించలేకపోయాడనేది ప్రపంచం ముందు కాదనలేని సత్యంగా కనబడుతోంది. ఈ తరుణంలో యావత్తు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారీ విధానంపైనా, సామ్రాజ్యవాదంపైనా పోరాడాల్సిన అవసరం ఉంది. మానవాళి విముక్తికి ఈ పోరాటాలు తప్పనిసరి. నెల్సన్ మండేలా స్వప్నాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. సామ్రాజ్యవాదంపై, పెట్టుబడిదారీ విధానంపై తిరుగుబావుటాలై ఎగిసిపడాలి. శాంతి కాముకులు ముందుకు సాగాలి. అదే నెల్సన్ మండేలాకు నిజమైన నివాళి..
(నేడు నెల్సన్ మండేలా శత జయంతి సందర్భంగా నివాళి వ్యాసం)
- అనంతోజు మోహన్ కృష్ణ