నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియంతృత్వ పోకడల వల్లే రాష్ట్రంలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేకుండాపోయిం దని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కత్తి మహేష్, పరిపూర్ణనందస్వామి తమ అభిప్రా యాలను స్వేచ్ఛగా చెప్పినందుకు వారిపై నగర బహిష్కరణ వేటు వేశారని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో నాకెలాంటి విభేదాలు లేవని, వేరే సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో నగర కాంగ్రెస్ సమావేశం నుంచి వెళ్లిపోయానన్నారు. పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తాను మద్దతు ఇస్తానన్నారు. లా అండ్ ఆర్డర్ పేరు మీద ఎవరిని బడితే వారిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. నగర బహిష్కరణలపై గవర్నర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm