హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం అర్ధరాత్రే తీవ్రవాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, ఒడిసాలోని గోపాలపూర్ మధ్య తీరం దాటనుందని అంచనా వేశారు. శుక్రవారం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి 12 గంటల వ్యవధిలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ నాగరత్న, రాజారావు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఇతరచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm