నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రొట్టెల పండుగ శుక్రవారం(నేటి) నుంచి అయిదు రోజుల పాటు జరగనుంది. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ పండుగకు సుమారు 16 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగకు కేంద్రంగా ఉన్న బారాషాహీద్ దర్గాను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దర్గా ఆవరణలో ఉన్న స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి పోలీసు బలగాలను రప్పించారు. మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm