ఉత్తరప్రదేశ్: లోని అలీగఢ్ లో పోలీసులు ఎన్ కౌంటర్ ను ప్రత్యక్షంగా చూపించి కలకలం రేపారు. తాము ఎన్ కౌంటర్ చేసేందుకు వెళుతున్నామని ముందుగానే మీడియాకు చెప్పి, వారిని మచువా గ్రామానికి తీసుకెళ్లిన పోలీసులు, ఇద్దరు హంతకులను కాల్చి చంపారు. పోలీసులను చూసిన హంతకులు కూడా ఫైరింగ్ చేయడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్ మచువాలోని ఓ పాడుబడిన భవంతిలో దాగున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు, మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడే వారిని ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. హతులైన ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా రికార్డులకు ఎక్కిన ముస్తకీమ్, నౌషద్ గా గుర్తించారు. వీరిపై ఆరు హత్య కేసులు, పదికి పైగా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత మృతుల వద్ద కంట్రీ మేడ్ ఫిస్టల్స్ లభించాయి. ఈ ఎన్ కౌంటర్ దృశ్యాలు ఇప్పుడు వార్తా చానళ్లలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm