హైదరాబాద్ : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వైపునకు ఓ వ్యక్తి చెప్పు విసిరేశాడు. పట్నాలో తమ పార్టీ జేడీయూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయనపై చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పేరు చంద్రమోహన్ అని, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో దాని వల్ల తాను నష్టపోతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. 'నేను అగ్రకులానికి చెందిన వ్యక్తిని. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగం పొందలేకపోతున్నాను' అంటూ ఆవేశంతో ఊగిపోతూ చంద్ర మోహన్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. నితీశ్ కుమార్పై ఆయన చెప్పు విసరడంతో జేడీయూ యువ కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని, ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm