హైదరాబాద్ : తన ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ దాడుల వెనుక వైకాపా అధినేత వైఎస్ జగన్ కుట్ర దాగుందని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. జగన్, ఆయన అనుచరుడు విజయసాయి కలసి రాజకీయంగా తనను దెబ్బతీయాలన్న కుట్రతో, ప్రధాని నరేంద్ర మోడీతో కలసి ఓ పథకం ప్రకారం, ఐటీ దాడులు చేయిస్తున్నారని సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. వైకాపా నేతలు తనపై ఐటీ దాడులు జరుగుతాయని ముందే చెప్పారని గుర్తు చేసిన ఆయన, బీజేపీ నేతలు సైతం అలానే మాట్లాడారని, ఇప్పుడు వారు చెప్పినట్టుగానే జరుగుతుండటాన్ని పరిశీలించిన ఎవరికైనా, దాడుల వెనకున్న మాస్టర్ ప్లాన్ అర్థమవుతుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరిపైనా ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నారని, తమిళనాడు, కర్ణాటకల్లో అదే జరిగిందని ఆయన విమర్శించారు. తమను వ్యతిరేకించిన వారికి ఇదే గతి పడుతుందన్న మెసేజ్ ని ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకుని తీరుతామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm