హైదరాబాద్: అన్ని పార్టీలు రానున్న ఎన్నికల్లో జనాభా ధమాశా ప్రకారం టికెట్లు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీలతో పాటు కొన్ని అగ్ర కులాల్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. ఎస్ సి వర్గీకరణకు రూట్మ్యాప్తో వచ్చే వారికి రానున్న ఎన్నికల్లో తాము మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. ఇదే విషయమై తమ సీనియర్ నాయకులతో చర్చించి ప్రజ ఆగ్రహ సభలో ప్రకటిస్తామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజ ఆగ్రహ సభను వాయిదా వేశామని, మరో 2, 3 రోజుల్లో వేదికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎం ఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm