పంజాబ్: అమృత్సర్లో గత శుక్రవారం రావణ దహణ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంలో 61మంది చనిపోగా... 70మంది గాయపడిన సంగతి విదితమే. అయితే ఈ విషాదానికి కారణమైన రైలును నడిపిన డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఓ వంతెన మీద వేలాడుతున్న మృతదేహానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... ‘అమృత్సర్ రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా అతడి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరచడమే దానికి కారణం. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి’ అని పేర్కొంటూ వేలాదిమంది దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోతో పాటు ఆ డ్రైవర్ పేరును అరవింద్ కుమార్గా పేర్కొంటూ, అతడు రాసిన ఆత్మహత్య లేఖ అంటూ ఒక లేఖను కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో ఆ లేఖను కూడా ఆ పోస్టు చేయడంతో అది నిజమే అని అందరు భావించారు. దానితో ఆ వీడియో కూడా వైరల్గా మారింది. #AmritsarTrainTragedy అనే హ్యాష్ట్యాగ్తో దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పంజాబ్ పోలీసు అధికారి కూడా ఒకరు ఉండటంతో ఆ పోస్టుకు మరింత బలం చేకూరింది. ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని అంతా నమ్మేశారు. పలు మీడియా సంస్థల్లో కూడా ఈ కథనాలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం ఇప్పుడు బయటపడింది. డ్రైవర్ ఆత్మహత్య న్యూస్ ఫేక్ అని తేలింది.
మరి ఈ న్యూస్ ఫేక్ అయితే ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు. మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు ఇలాంటి సందేహాలు చాలా మందికి కలుగుతాయి. అయితే ప్రస్తుతం అతడు పంజాబ్ రైల్వేస్ కస్టడీలో ఉన్నాడు. డ్రైవర్ సూసైడ్ వార్త ఫేక్ అని అమృత్సర్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ అమృత్ సింగ్ తెలిపారు. ఆ ఫొటోల్లో ఆత్మహత్య లేఖ అంటూ చూపుతున్న లేఖ అసలు ఆత్మహత్య లేఖే కాదని కూడా రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ను వ్యాపింపజేసి విషయాన్ని సంచలనంగా మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో అక్టోబర్ 20 అమృత్సర్ గ్రామీణ ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయిన ఓ వ్యక్తిదని పోలీసులు తెలిపారు.చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. పండుగ వేళ భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడటానికి కారణమైన ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త పూర్తిగా అవాస్తవం.