న్యూఢిల్లీ: సీబీఐ అంతర్యుద్ధం కోర్టుకు చేరింది. దేశ అత్యున్నత విచారణ సంస్థ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై వచ్చే సోమవారం వరకు ఎలాంటి చర్యా తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకున్నారన్న కేసులో ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యా తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. రాకేష్ ఆస్థానాపై వచ్చిన ఆరోపణపై స్పందించాలంటూ సీబీఐ డైరెక్టర్కు సమన్లు జారీ చేసిన కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అంతేకాదు రాకేష్ ఆస్థానాకు చెందిన మొబైల్స్, ల్యాప్టాప్స్లాంటి అన్ని ఎలక్ట్రానిక్స్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. ఆస్థానా లంచం తీసుకున్నారన్న కేసుకు సంబంధించి సోమవారమే తమ డీఎస్పీ దేవేందర్కుమార్ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ తప్పుడు స్టేట్మెంట్ను సృష్టించారన్న అభియోగం కింద ఆయనను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm