వాషింగ్టన్ : నవంబరు 6న జరిగే మధ్యంతర ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదకరమైన పర్యవసానాలు ఎదురుకోక తప్పదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ప్రగతిశీల మార్పులు అమలు కావాలంటే ఓటు కచ్చితంగా వేయాలని, కేవలం విమర్శించడ మొక్కటే సరిపోదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవిత కాలంలో నాకు గుర్తున్నంతవరకు ఈ నవంబరు ఎన్నికలు చాలా కీలకమైనవి అని లాస్వెగాస్ రాజకీయ ర్యాలీ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు ప్రతీసారీ ఇలానే చెబుతూ వుంటారు, కానీ నిజంగానే ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక అని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ఒబామా ప్రసంగమంతా ఆయనను పరోక్షంగా విమర్శిస్తూనే సాగింది. ఆర్థికంగా దేశం ఈ స్థితిలో వుండడానికి తనదే ఘనత అని ట్రంప్ చెప్పుకోవడాన్ని ఖండించిన ఒబామా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆర్థిక అద్భుతాలన్నీ గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ వీటిని ఎవరు ప్రారంభించారో గుర్తు చేసుకోండి అని ఒబామా వ్యాఖ్యానించారు. కొంతమందిలా కాకుండా, వాస్తవాలనే చెప్పేందుకు నేను ప్రయత్నిస్తుంటా, నిజాలనే విశ్వసిస్తా, వాస్తవిక రాజకీయాల్లోనే నాకు నమ్మకముంది అని ఒబామా పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm