హైదరాబాద్: మన్యంలో(ఏఓబీలో) మరలా మావోయిస్టు పోస్టర్ల కలకలం చెలరేగింది. గతనెల 12న వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ, పలకజీడి గ్రామంలో సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో సీపీఐ(మావోయిస్టు) ఎంకేవీబీ డివిజన్ కమిటీ పేరున కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింతచెట్లకు అతికించి దర్శనమిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపు సంత కావడంతో, వాటిని చూసిన సంత నిర్వాహకులైన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈనెలలో రెండుసార్లు కూడా వారపు సంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వారపుసంత నిర్వహించే వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆ పోస్టర్ల ద్వా్డరా బాక్సైటు తవ్వకాలు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm