హైదరాబాద్: కొంత మంది చేసే తప్పులు మొత్తం వ్యవస్థనే దెబ్బ తీస్తున్నాయని, ఈ విషయం గ్రహించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కే.జీ.శంకర్ సూచించారు. దోమలగూ డలోని ఏవీ కళాశాలలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పాత్రికేయుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై జస్టిస్ కే.జీ. శంకర్ మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి కత్తి మీద సాములాంటిదని, సమాజంలో అతి ప్రాధాన్యత కలిగిన వృత్తులలో ఒకటి పాత్రికేయ వృత్తి అని అన్నారు. గతంలో ఉండే విధంగా నేడు పత్రికలు, వార్తలు ఉండటం లేదని, నేడు ప్రతి చిన్న అంశాన్నీ వివాదాస్పద వార్తగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సందర్భాలలో చిన్న వివాదాలను సైతం వార్తలుగా ప్రచురించి పత్రికా సంస్థలు క్షమాపణలు కూడా చెప్పాయని గుర్తు చేశారు. సీనియర్ పాత్రికేయుడు టంకసాల అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం పాలకుల విధానాలు, ప్రజల వైఖరుల పైన స్వేచ్ఛగా వార్తలు రాసే అధికా రం పాత్రికేయులకు ఉందన్నారు. మంచీ చెడులు బేరీజు వేసుకుని రాయాలన్నారు. ఎన్యూజేఐ జాతీయ కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ జర్నలిస్టులకు రక్షణ, వేతనాల సవరణ చట్టాలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా టంకసాల అశోక్, టీవీ రమణ, నిమ్మల రాజు గౌడ్, షేక్ హసీనాలను ఆత్మీయంగా సత్కరించారు.
Mon Jan 19, 2015 06:51 pm