హైదరాబాద్ : హైదరాబాద్లో అక్రమంగా నివాసముంటూ, నకిలీ సర్టిఫికెట్లు సంపాదించిన పాకిస్తానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బా స్ ఇక్రమ్కు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ముంబైకి చెందిన వ్యక్తిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన మహిళకు దుబాయ్లో పారిచయం అయిన ఇక్రమ్, తాను భారతీయుడినని స్వస్థలం ఢిల్లీ అని చెప్పి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను పాకిస్తానీవాసి అని తెలుసుకున్న ఆమె, తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఆమె భారత్కు వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న అక్రమ్ నేపాల్ నుంచి అక్రమ మార్గంలో ఇండియాలోకి ప్రవేశించి, హైదరాబాద్కు చేరుకున్నాడు. సుమారు ఆరు ఏండ్లపాటు హైదరాబాద్లో ఉంటూ, నకిలీ సర్టిఫికెట్లను సమకూర్చుకొని వాటి ఆధారంగా భారతీయుడని పాస్పోర్టు కూడా పొందాడు. అయితే హైదరాబాద్లో దుబాయ్లో పెండ్లి చేసుకున్న మహిళ ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు. ఆమెను, ఆమె కూతురును ఇబ్బందులకు గురిచేయడంతో పాటు కూతురు నగ్న చిత్రాలు సెల్ఫోన్లో తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతన్ని మూడు నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి, అతనికి నకిలీ సర్టిఫికెట్లు సమకూర్చిన ముంబైవాసి రమేశ్ ములే అలియాస్ రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేసినట్లు కూడా నకిలీ సర్టిఫికెట్ను ఇక్రమ్ సంపాదించాడు.
Mon Jan 19, 2015 06:51 pm