ముంబై: ఆర్బీఐ స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం దాస్ నేడు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐకి సేవలందించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. భారత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల మేరకు పనిచేస్తాను. ఆర్బీఐ వంటి గొప్ప సంస్థ స్వయంప్రతిపత్తి, విశ్వసనీయత, విలువను పరిరక్షించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను అని దాస్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైనదని.. ప్రస్తుతం ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవో, ఎండీలతో గురువారం సమావేశం కానున్నట్లు దాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఇటీవల ఆర్బీఐ, కేంద్రం మధ్య నెలకొన్ని వివాదాల అంశాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాల్లోకి వెళ్లాలనుకోవట్లేదు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్బీఐ వంటి సంస్థకు స్వతంత్రత చాలా ముఖ్యం. ప్రస్తుతం అది చెక్కుచెదరకుండా ఉంది అని దాస్ అన్నారు. శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm