వాషింగ్టన్: గూగుల్ సెర్చ్ ఇంజిన్ సమాచార గోప్యత అంశానికి సంబంధించి ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆ కమిటీలో ప్రమీలా జయపాల్ కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె చట్టసభకు ఎన్నికైన తొలి ప్రవాస భారతీయురాలు. ఆమె రాజకీయ రంగంలో ఉన్నత స్థానంలో ఉండగా, సుందర్ పిచాయ్ దిగ్గజ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ వ్యవహరిస్తున్నారు. ఆయన్ను కమిటీ విచారిస్తోన్న సమయంలో ప్రమీలా స్వస్థలాన్ని గుర్తు చేస్తూ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. ఒక్కసారి వ్యక్తిగత విషయానికొద్దాం. మనిద్దరం భారత్ దేశంలోని ఒకే రాష్ట్రంలో జన్మించాం. ఒక దిగ్గజ కంపెనీకి మీరు సారథ్యం వహిస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వలసలు అమెరికా అభివృద్ధికి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. మిగతా విషయాలు ఎలా ఉన్నా..థ్యాంక్యూ మిస్టర్ పిచాయ్ అని గూగుల్ సీఈఓను అభినందించారు. సుందర్ పిచాయ్(46) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన 2004లో గూగుల్లో చేరారు. 2015 నాటికి సీఈఓగా ఎదిగారు. ప్రమీలా జయపాల్(53) కూడా చెన్నైలోనే జన్మించారు. విద్యార్థిగా అమెరికా వచ్చిన ఆమె.. అమెరికా పౌరసత్వం పొంది చట్టసభకు ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళగా నిలిచారు. ఈ విచారణ సందర్భంగా ఆమె అనేక విషయాల పై పిచాయ్ను ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm