నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాల్వకు నీటి విడుదలను డ్యాం అధికారులు ఉదయం 10 గంటలకు నిలిపివేసినట్లు తెలిపారు. కుడి కాలువ పరిధిలో గ్రామాల్లో తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా రివర్ బోర్డు 91.874 టీఎంసీల నీటిని కేటాయింది. ఈ నీటి వాటాలో భాగంగా నవంబరు 7నుంచి కుడి కాలువకు నీటి విడుదలను చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రోజుకు 9వేల క్యూసెక్కుల చొప్పున 37రోజుల్లో 83.05 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యాం అధికారులు వివరించారు. మిగిలిన నీటి వాటాలను ఆ ప్రాంత అవసరాల మేరకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రానికి సాగర్ నీటి మట్టం 549.10 అడుగుగులగా ఉంది. ఇది 207.7988 టీఎంసీలకు సమానం. కాగా ఎస్ఎల్బీసీ ద్వారా 550 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 1609 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ నుంచి 11,796 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm