హైదరాబాద్ : సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష, ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే నగదు రహిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఇప్పటి వరకు రోగులకు అందించిన చికిత్సకు సంబంధించి ప్రభుత్వం రూ.500 కోట్లకు పైగా బకాయిపడడంతో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తెలిపింది. అయితే, అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వి. మురళీకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా అందించిన చికిత్సకు గాను 450 ఆసుపత్రులకు రూ.500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని, లేకుంటే సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకనే రేపటి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm