హైదరాబాద్ : ఓటమి పాలయ్యామని కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ఎన్నికల అనంతరం మొదటిసారిగా మండల కేంద్రానికి వచ్చిన ఆయన ఆ పార్టీ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, తన వద్దకే అన్ని పదవులు వచ్చాయన్నారు. తాను సాగర్ నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేశానని, ప్రతి గ్రామంలో విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి వసతులను కల్పించి మౌళిక వసతుల ఏర్పాటులో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపానన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు పరిపాటేనని, వాటిని కార్యకర్తలంతా జాలీగా తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత పథకాల హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకుందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.2.70 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా దేశ చరిత్రలో నిలిపిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభపర్చారని, తాను ఓటర్లను ప్రలోభపర్చేందుకు తన వద్ద డబ్బుల్లేకనే ఓడిపోయానన్నారు. పార్టీ కార్యకర్తలంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటి ముందుకెళ్లేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి రంగశాయిరెడ్డి, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, మాజీ జెడ్పీటీసీ కొండేటి మల్లయ్య, ఆ పార్టీ మండలాధ్యక్షులు ఉన్నం చిన వీరయ్య, అంకతి సత్యం, సెల్ జిల్లా నాయకులు డేవిడ్, మేరెడ్డి వెంకటరాహుల్, ఇంజమూరి ప్రభాకర్, వెంకటేశ్వర్లు, మేరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm