హైదరాబాద్ : ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అన్నా రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న ఒంగోలుకు వచ్చిన ఆయన, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. నెలాఖరులోగా తాను జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని చెప్పారు. కాగా, గత ఎన్నికల అనంతరం రాంబాబు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆపై వైకాపాలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేయగా, రెండు రోజుల క్రితం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనుచరులతో వచ్చి బాలినేనిని కలిశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, గిద్దలూరులో వైసీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. 26 లేదా 27 తేదీల్లో ఆయన పార్టీలో చేరుతారని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm