విజయవాడ: టీఆర్ఎస్ నేత కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీర్ గాళ్స్లా చిందులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన మీరా చంద్రబాబును విమర్శించేదంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు. వైఎస్ను తిట్టిన కేసీఆర్ ఇప్పుడు జగన్కు మహానుభావుడిలా కనిపిస్తున్నారని, సీఎం కుర్చీ కోసం ఎంత నీచానికైనా సిద్ధపడే వ్యక్తి జగన్ అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓవైసీ బీజేపీ మాయలో పడి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తానంటున్నారని, కేటీఆర్, ఓవైసీ ఏపీకి వచ్చి ప్రచారం చేస్తే తమకు అభ్యంతరం లేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm