ప్రకాశం: వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొండేపి మండలం జాల్లపాలెం వద్ద వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వేగం నియంత్రణలోకి రాకపోవడంతో పక్కనే ఉన్న కాలువలోకి బస్సు దిగిపోయింది. అయితే అదృష్టవశాత్తూ కాలువలో నీళ్లు లేకపోవడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్నవెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm