భోపాల్: ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న మరో వ్యక్తిని గుర్తించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ రాయ్సేన్ లో చోటుచేసుకుంది. మృతుల్లో మహిళ, ఆమె 12 రోజుల వయస్సున్న పసిబిడ్డ, తల్లి(40), సోదరుడు(12) ఉన్నారు. కుటుంబ సభ్యులు రోజంతా కనిపించలేదు. దీంతో చుట్టుప్రక్కల వాళ్లు వెళ్లి తలుపు తట్టారు. ఎంతకు తీయకపోయేసరికి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా భర్త సంజూ భూరియా తప్ప మిగిలిన నలుగురు మృతి చెంది ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బొగ్గుల కుంపటి ఉందని.. ఊపిరాడక వీరంతా మృతిచెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరమే వీరి మృతికి అసలైన కారణం తెలుస్తుందన్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm