ముంబై: మహారాష్ట్రలో ఉగ్ర కలకలం చెలరేగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 9 మందిని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) అరెస్టు చేసింది. వీరిలో 17ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముండటంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా ఐఎస్ఐఎస్తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారమందింది. దీంతో దర్యాప్తు సాగించిన మహారాష్ట్ర ఏటీఎస్ బృందాలు ముంబ్రా, ఠాణె, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 9 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. సోదాల్లో కొన్ని రసాయనాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిళ్లు, కత్తులు తదితర ఆయుధాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm