న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కార్పొరేషన్ దేశంలోని చెల్లింపు సేవలపై గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఒక వేళ ఇదే పరిస్థితి ఏర్పడి ఆ సంస్థ ఏదైనా సాంకేతిక సమస్యల్లో చిక్కుకుంటే భారత్లోని రిటైల్ చెల్లింపు సేవలు కష్టమైపోతాయని భావిస్తోంది. ఇప్పటికే ఎన్పీసీఐ దేశంలోని సగానికి పైగా డిజిటల్ చెల్లిపులను పర్యవేక్షిస్తోంది. ఇటీవల దేశంలో చెల్లింపు సేవలను కొన్ని సంస్థలకే పరిమితం చేయడంపై జరిగిన చర్చలో ఆర్బీఐ అభిప్రాయపడింది. కొన్ని రకాల చెల్లింపు సేవలకు నేషనల్ ఫైనాన్స్ స్విచ్, ఇమిడియట్ పేమెంట్ సర్వీస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటివి మాత్రమే ఉన్నాయి. ఈ రంగంలో పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సి ఉందని పేర్కొంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో కొత్త సంస్థల అవసరం చాలా ఉందని ఆర్బీఐ భావిస్తోంది. దేశ వ్యాప్తంగా చెల్లింపు సేవలను ప్రోత్సహించేందుకు రిజర్వుబ్యాంక్ ఈ రంగంలో కొత్త వారిని ప్రోత్సహిస్తుంది. రిటైల్ చెల్లింపు సేవలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండటమే ఆర్బీఐ లక్ష్యం. ఆర్థిక స్థిరత్వం దిశగా పురోగతి సాధించేందుకు కూడా పోటీ, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సి ఉందని ఆర్బీఐ ఒకనోట్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm