హైదరాబాద్ : పుల్వామాలో చోటు చేసుకున్న ఘోర ఉగ్రదాడిపై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. అంతకంతా మూల్యం చెల్లించుకుంటారంటూ ప్రధాని మోడీ కాసేపటి క్రితం హెచ్చరించారు. భారత మీడియా కూడా ఈ ఘటనపై వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. పాకిస్థాన్ ను టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి, తమ దేశానికి సంబంధం ఉన్నట్టుగా భారత ప్రభుత్వం, అక్కడి మీడియా చిత్రీకరిస్తోందని... ఎలాంటి విచారణ జరపకుండానే ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పాకిస్థాన్ తెలిపింది. ఈ ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. భారత్ ఆక్రమిత కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని పాకిస్థాన్ తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి హింస జరిగినా, తాము ఖండిస్తూనే వస్తున్నామని చెప్పింది. అలాంటి తమకు ఉగ్రదాడితో సంబంధం ఉందనే విధంగా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. ఈమేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm