ఢిల్లీ: భద్రతాబలగాల మీద జరిగిన ఉగ్రదాడిని దారుణమైన చర్యగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అలాగే రాజకీయ వివాదాలకు సంబంధించిన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వనని, దానికి ఇది సరైన సమయం కాదని వెల్లడించారు. శుక్రవారం దిల్లీలో జరిగిన మీడియా కార్యక్రమంలో రాహుల్తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు. 'ఇది చాలా దారుణమైన దాడి. ఈ ఘటన చాలా విచారకరం. జవాన్లకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఏ శక్తి మన దేశాన్ని విభజించలేదు. ప్రభుత్వానికి మా సహకారాన్ని అందిస్తాం. రెండు రోజుల వరకు ఏ ఇతర అంశాలను చర్చించం' అని రాహుల్ ప్రకటించారు. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ..'ఇది చాలా బాధాకరమైన రోజు. మన దేశం 40 మంది జవాన్లను కోల్పోయింది. జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు' అని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
Mon Jan 19, 2015 06:51 pm