హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. గతంలోనూ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న సానియా తాజాగా పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనూ విమర్శలపాలవుతోంది. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అయితే, సానియా మీర్జా శుక్రవారం నాడు తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన పోస్టు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సరికొత్త డ్రెస్ వేసుకున్నాను చూడండి, డిజైన్ చేసింది వారు, మేకప్ చేసింది వీరు... అంటూ ఓ పర్సనల్ పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దాని లింక్ ను ట్వీట్ చేసింది. దాంతో నెటిజన్లు కోపంతో ఊగిపోయారు. దేశం మొత్తం ఉగ్రదాడికి బాధపడుతుంటే నువ్వు మాత్రం ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేస్తావా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు నీ ఫొటోలు చూసేంత ఆసక్తి లేదు... కనీసం దాడి పట్ల చిన్న స్పందన కూడా లేకుండా ఇలా ఫొటోలు పెడతావా అంటూ నిప్పులు కక్కారు. నీ కొత్త డ్రెస్ చూపించడానికి ఇదా సమయం... నువ్వసలు భారతీయురాలివేనా అంటూ నిలదీశారు.
Mon Jan 19, 2015 06:51 pm