లక్నో: నా పది లక్షలను దొంగిలించారు. వాటిని రికవరీ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా.. ఇదెవరో ఓ సాధారణ పౌరుడు చెప్పిన మాట కాదు. ఓ ఎమ్మెల్యేనే సాక్షాత్తూ అసెంబ్లీలో ఈ విషయం చెప్పి కంటతడి పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఈ అరుదైన ఘటన జరిగింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్పనాథ్ పాశ్వాన్ తన రూ.10 లక్షలు పోయాయంటూ వాపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదని ఫీలయ్యారు. సభలో రెండు చేతులూ జోడించి వేడుకుంటున్నా. ఇక్కడే నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడికి వెళ్లాలి. నేను చాలా పేద వాడిని. నా డబ్బు రికవరీ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని జీరో హవర్ సందర్భంగా పాశ్వాన్ వేడుకున్నారు. ఆజమ్ఘర్లోని ఓ హోటల్లో తన డబ్బు చోరీకి గురైందని ఆ ఎమ్మెల్యే చెప్పారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా.. తాను దీనిపై విచారణ జరిపి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm