రాజస్థాన్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో యావత్ భారతం పాకిస్థాన్పై ఆగ్రహంగా ఉంది. ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్లు వద్దంటూ పలువురు సూచిస్తుండగా.. పాక్ కళాకారులు భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తెలిపింది. తాజాగా రాజస్థాన్లోని బికనేర్ జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. తమ జిల్లాలోని పాకిస్థానీలు 48 గంటల్లోనే నగరాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించొద్దని ఆదేశించారు. పాక్ దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారితో ప్రత్యక్ష లేదా పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ ఉన్న సిమ్ కార్డులను కూడా వినియోగించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెండు నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm