ఇండోర్: సరిహద్దు వెంట ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక రక్షణ కవచం కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టం(సీఐబీఎమ్మెస్)కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం అదనపు డైరెక్టర్ జనరల్ ఏకే. శర్మ తెలిపారు. భారత సరిహద్దుల్లో దాదాపు 2000కి.మీ మేర సున్నితమైన ప్రదేశాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొరుగు దేశాల నుంచి అక్రమంగా చొరబడుతున్న దుండగులను ఈ వ్యవస్థ ద్వారా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ పనులు మరో ఆరు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జమ్ముతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరికరాల ఏర్పాటు పూర్తయిందన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm