హైదరాబాద్: ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక అవకాశం కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పలు వివాదాలతో పెండింగ్లో ఉన్న పన్ను వసూలు చేసేందుకు సర్కిళ్ల వారీగా ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం (పీటీపీ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటులో ఉంటారని కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. కోర్టు కేసులు, ఆస్తిపన్ను మదింపులో వ్యత్యాసాలు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించనున్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారంతో రూ.100 కోట్ల ఆస్తిపన్ను అదనంగా వసూలైంది. ఇప్పుడు కూడా కనీసం రూ.150 కోట్లు అదనంగా వసూలు చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm