హైదరాబాద్: వాహన తనిఖీలలో భాగంగా అనధికారికంగా తరలిస్తున్న రెండు లక్షల 80 వేల రూపాయల నగదును మూడో పట్టణ ఎస్ఐ అప్పారావు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.... సాధారణ ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం గత కొద్దిరోజులుగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఏలూరు నగర శివార్లలోని వట్లూరు ప్రాంతంలో వాహన తనిఖీలు ఎస్.ఐ అప్పారావు ఆయన సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కృష్ణా జిల్లా గుడివాడ నుండి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతానికి కారులో వెళ్తున్న వ్యక్తి కారును తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా రెండు లక్షల 80 వేల రూపాయలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రెండు లక్షలకు పైబడి ఎక్కువగా నగదును సరైన పత్రాలు లేకుండా తరలిస్తే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. సరైన పత్రాలు లేకుండా బంగారం, నగదు రవాణా చేయరాదని ఆయన సూచించారు. తనిఖీలలో మూడో పట్టణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm