న్యూఢిల్లీ: పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులపై సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. పేపర్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను తగ్గించి, వివరణాత్మక సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు పెంచడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, రాత నైపుణ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బట్టీ విధానానికి స్వస్తి పలకాలని యోచిస్తోంది. ఈ విధానంలో ఒక్కో ప్రశ్నకు ప్రస్తుతం ఇస్తున్న మార్కులను పెంచడం ద్వారా మరింత వివరంగా సమాధానాలు రాసేలా విద్యార్థులను ప్రోత్సహించే అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. మార్పులు ఖరారైన తర్వాత నమూనా పేపర్లను విడుదల చేస్తామని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రశ్నపత్రాన్ని సమూలంగా మార్చడం లేదని, దీనిపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm