హైదరాబాద్ : పీడిత, తాడిత నిరుపేదల కోసం తన సర్వం త్యాగం చేసిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పలువురు కొనియాడారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, డాక్టర్ మువ్వాకొండయ్య, ఓ.రామకోటయ్య, డి.రామమూర్తి తదితరులు సుందరయ్య సేవలను కొనియాడుతూ ఘన నివాళి అర్పించారు. తెలంగాణా సాయుధ పొరాటంలో పాల్గొన్న పుచ్చలపల్లి సుందరయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆ తరువాత ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికై ఆదర్శమూర్తిగా నిలిచారని శ్లాఘించారు. నేటి రాజకీయాలలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎందరో అధికార దర్పాన్ని, ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారందరికీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా జీవితం ఓ గుణపాఠంగా మారాలని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన పుచ్చలపల్లి సుందరయ్యను నేటి రాజకీయ నాయకులు స్పూర్తిగా ఎంచుకోవాలని కోరారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చీదెళ్ళ సుబ్బారవు, పి.నరసింహం, టి.వెంకట్రావు, యం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm