హైదరాబాద్ : ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేత రోజా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా తాము నమ్మమని, ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని అన్నారు. దేశంలో ఏ నాయకుడు ఇంత వరకూ చేయని విధంగా జగన్ పాదయాత్ర చేశారని, ప్రజలను కలిసి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారని చెప్పారు. జగన్ పై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వారి కళ్లలో చూశామని, కచ్చితంగా, జగన్ సీఎం కాబోతున్నారని గంటాపథంగా చెబుతున్నానని అన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచవని ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అయితే బాగుంటుందనుకుని చంద్రబాబును గెలిపిస్తే, రాష్ట్రానికి ఆయనేమీ చేయలేకపోయారని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm