హైదరాబాద్: వైద్యం సరిగా చేయడం లేదంటూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోగి బంధువులు వైద్యుడిపై దాడికి దిగారు. ఎమర్జెన్సీ వార్డు వద్ద నానా హంగామా చేశారు. డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు.దీంతో మిగతా రోగులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ వ్యక్తికి చికిత్స అందడంలేదంటూ పలువురు ఆదివారం రాత్రి నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద గొడవకు దిగారు. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చేయి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ సరిగా స్పందించలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ముందే డాక్టర్లతో వాగ్వాదానికి దిగిన బంధువులు తాము మంత్రి అనుచరులం అంటూ, చికిత్స ఎలా చేయరంటూ దుర్భాషలాడారు. ఈ ఘటనపై నిమ్స్ ఆప్పత్రి సిబ్బంది ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm