హైదరాబాద్ : బీర్ల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సంగారెడ్డి నుంచి బీర్లను నంద్యాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల ఆర్టీవో ఆఫీస్ దగ్గర నాకౌట్ బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనువెంటనే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలార్పేందుకు యత్నించిన డ్రైవర్ గాయాలపాలయ్యాడు. స్థానికులు ఆ డ్రైవర్ను నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లారీ మొత్తం మంటల్లో చిక్కుకోవడతో.. మంటల్లో బీరు సీసాలు పేలుతున్నాయి దీంతో గాజు సీసాల ముక్కలు ఎగిరిపడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm