హైదరాబాద్ : ఏపీలో జనసేన ప్రభావం పెద్దగా ఏమీ లేదని, ఆ పార్టీకి చాలా స్వల్పంగా మాత్రమే సీట్లు వస్తాయంటోన్న పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై జనసేన విశాఖ లోక్సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ను తాను పట్టించుకోనన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటానని స్పష్టంచేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23వరకు వేచి చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. విశాఖ వన్టౌన్లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎగ్జిట్ పోల్స్తో మాకేమీ ఆందోళన లేదు. అనవసరంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుంది. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది. గెలుపోటములు సహజం. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నాం. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ వల్ల కలిగే ప్రభావం మాపై ఏమీ కనబడటంలేదు' అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm