హైదరాబాద్ : మంచు కుటుంబ వారసుడిగా తెరపైకి వచ్చిన మంచు మనోజ్ మాస్ కథానాయకుడిగా ఎదిగారు. ఈమధ్య వరుస పరాజయాలు ఆయన జోరును కాస్త తగ్గించాయి. కానీ సినిమాపై ఆయనకున్న ప్యాషన్లో మాత్రం ఏం మార్పులేదు. ఎప్పుడైనా మళ్లీ కెమెరా ముందుకు రావొచ్చు. ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు రెండో కుమారుడైన మంచు మనోజ్ 20 మే 1983లో జన్మించారు. చిన్నప్పుడే 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్తో కలిసి ఆ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటుంటారు మనోజ్. 2004లో 'దొంగ దొంగది' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'శ్రీ', 'రాజుభాయ్', 'నేను మీకు తెలుసా?', 'ప్రయాణం', 'బిందాస్', 'వేదం', 'ఝుమ్మంది నాదం', 'మిస్టర్ నూకయ్య', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', 'పోటుగాడు', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'కరెంట్ తీగ', 'శౌర్య', 'అటాక్', 'గుంటూరోడు' చిత్రాలు చేశారు. 'ఒక్కడు మిగిలాడు' తర్వాత ఆయన సినిమాలేమీ చేయలేదు. ప్రణతిరెడ్డిని ప్రేమించిన మనోజ్ ఆమెని 20 మే 2015న పెళ్లాడారు. ఈ రోజు మనోజ్ పుట్టినరోజు.
Mon Jan 19, 2015 06:51 pm