హైదరాబాద్ : డిగ్రీలోనే చదువుకు డుమ్మా కొట్టాడు. ఆపై హోటల్లో పనికి కుదిరాడు. కొద్ది నెలలకే ఎస్సై అవతారమెత్తాడు. నాలుగు డబ్బులు వెనకేసుకున్నాడు. ఊరికొచ్చి పోజుకొట్టాలని చూసి.. పోలీసులకు చిక్కాడు. ఇదీ.. నకిలీ ఎస్సైగా అవతారమెత్తిన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి బంకపల్లి ప్రసాద్ అనే యువకుడి కథ. అతడిని చీపురుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ప్రసాద్ కొంతకాలం క్రితం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డిగ్రీ ప్రవేశం పొంది మొదట్లోనే చదువుకు స్వస్తి చెప్పాడు. విజయవాడలోని ఓ హోటల్లో పనిలో చేరాడు. మూడు నెలల నుంచి నకిలీ ఎస్సై అవతారమెత్తి చలామణీ అవుతున్నాడు. ఈ క్రమంలో భీమవరం మండలానికి చెందిన స్వామి, గణేష్, ప్రసాద్ అనే ముగ్గురు యువకులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి నుంచి రూ.24 వేలు వసూలు చేశాడు. ప్రసాద్ గురువారం విజయవాడ నుంచి పోలీస్ యూనిఫాంలో తన స్వగ్రామానికి వచ్చాడు. ఖాళీగా ఉండే ప్రసాద్ ఉన్నపలంగా ఎస్సై ఎలా అయ్యాడనే అనుమానంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ప్రసాద్ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతను నకిలీ పోలీసు అని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm