రాజోలు : మండలోని రాజోలు గ్రామ రైతుల పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడి ప్రమాదకరంగా ఉన్నాయని గ్రామ రైతులు పొతుల వెంకటరావు, కుంపట్ల వెంకటేశ్వర రావు,జి.ధర్మరావు శనివారం వాపోయారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. రాజోలు సబ్ స్టేషను సమీపంలోని రైతుల వరి చేలలో విద్యుత్ లైనుకు సంబంధించిన విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో ఉన్నాయన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనలో ఉన్నామని తెలిపారు. పొలాల్లో దుక్కి దున్నుకోవడానికి విత్తన, కలుపు తదితర పనులు చేసుకోవడానికి ఇబ్బందులు గురవుతున్నామన్నారు. కొంతకాలంగా సంబంధిత విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ స్టేషను కార్యాలయం దగ్గరలో ఉన్న సమస్యనే పరిష్కారించకపొతే, శివారు ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా వ్యవహరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవి కావడంతో ఈ సమయంలోనే విద్యుత్ పనులు చేయడానికి వీలువుంటుందని, ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని, లేకపోతే పంట పోలాలలో ప్రాణనష్టం తప్పదని రైతులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm