హైదరాబాద్ : ఆస్ట్రేలియా నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక దూకుడుగా ఆడుతూ ఆసీస్కు చెమటలు పట్టిస్తోంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె-కుశాల్ పెరీరాలు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే, 115 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని మిచెల్ స్టార్క్ విడగొట్టాడు. అతడు వేసిన 16వ ఓవర్ మూడో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపూ ఆసీస్ బౌలర్లకు వణికించిన పెరీరా 36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 52 పరుగులు చేశాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ కరుణరత్నె కూడా అర్ధ సెంచరీ పూర్తిచేసుకుని దూకుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. కరుణరత్నె 78, తిరిమన్నె 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm