న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ముఖర్జీ నగర్ ఏరియాలో నడిరోడ్డుపై పోలీసుల వీరంగం సంచలనమైంది. ఆటో డ్రైవర్లపై పోలీసులు మూకుమ్మడిగా విరుచుకుపడి తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో కేంద్ర హోం శాఖ తక్షణ చర్యలకు దిగింది. ఈ ఘటనపై తక్షణం నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ను హోం శాఖ ఆదేశించింది. ముఖర్జీ నగర్ ఘటనలో కొద్దిసేపు వాగ్వాదం అనంతరం ఇద్దరు ఆటోరిక్షా డ్రైవర్లపై పోలీసులు విరుచుకుపడి, ఒకరిని పెడరెక్కలు విరిచిపట్టుకుని కింద పడేసి బూటుకాళ్లతో బలంగా తన్నుతుండటం వీడియోలో చోటుచేసుకుంది. రోడ్డుపై జనం చూస్తుండగా పోలీసులు చేసిన వీరంగం సంచలనమైంది. ఈ ఘటనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దారణమని, దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని బాధితుడి ఇంటికి కేజ్రీవాల్ సోమవారంనాడు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఘటనను తీవ్రంగా ఖండించారు.
Mon Jan 19, 2015 06:51 pm