నిర్మల్ : భావితరాలకు ఉజ్వల భవిష్యత్ను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. నిర్మల్ నియోజకవర్గ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గురుకుల పాఠశాలల ఏర్పాటుతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు పడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీయం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ సర్కార్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ గురుకుల పాఠశాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ)లను ఏర్పాటు చేసిందన్నారు. కొత్తగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున బీసీ గురుకులాలు కేటాయించారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm